అప్‌ట్రెండ్‌ కొనసాగే ఛాన్స్..! | Uptrends With Narendra Modi Oath | Sakshi
Sakshi News home page

అప్‌ట్రెండ్‌ కొనసాగే ఛాన్స్..!

May 27 2019 8:51 AM | Updated on May 27 2019 8:51 AM

Uptrends With Narendra Modi Oath - Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్న ఉత్సాహభరిత వాతావరణం...మార్కెట్లో మరికొద్దిరోజులు వుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, దేశీ స్థూల ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి నిలుపుతారని కూడా విశ్లేషకులు చెపుతున్నారు.  దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ఈవారంలోనే ముహూర్తం ఖరారైంది. ఈనెల 30న (గురువారం) సాయంత్రం 7 గంటలకు మోదీతో పాటు కేంద్ర కేబినెట్‌ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అయితే, ఎంతమంది కేబినెట్‌ మంత్రులు ఉంటారనే అంశం ఇంకా తెలియకపోవడంతో మార్కెట్‌ వర్గాలు ఈ అంశంపై దృష్టిసారించాయి. ప్రమాణస్వీకారం రోజునే.. మే సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉన్న కారణంగా ఆరోజున భారీ స్థాయిలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా మార్కెట్లో ఉత్సాహభరిత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌ అంబానీ అన్నారు. ఈవారంలో అయితే సూచీల ప్రయాణం ఎటువైపు ఉంటుందనే అంశంపై పూర్తి అవగాహన రాకపోవచ్చని తాను భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ అండ్‌ స్టాక్‌ నోట్‌ వ్యవస్థాపక సీఈవో జిమీత్‌ మోడీ వ్యాఖ్యానించారు. తేలికపాటి అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉందని, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదలాడవచ్చని విశ్లేషించారు. 

సంస్కరణల ఆధారంగానే ర్యాలీ..  
‘ఎన్నికలు అనే అతిపెద్ద కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ నుంచి ముడిచమురు ధరల కదలికలు, కంపెనీల ఎర్నింగ్స్‌ గైడెన్స్‌ మార్కెట్‌కు కీలకంకానున్నాయి’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టనున్న నూతన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకుని వెళ్లనున్నాయని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ విజయ్‌ చందోక్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లు ఆశాజనకంగా ఉన్నందున ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కూడా భారీగా రానున్నాయని అంచనావేస్తున్నట్లు చెప్పారాయన. ‘ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, నూతన ప్రభుత్వ బడ్జెట్‌ ప్రకటన వెలువడే వరకు మార్కెట్లో వేచిచూసే ధోరణే ఉండవచ్చు. ఇక నుంచి క్రమంగా ఒడిదుడుకులు తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని జిమీత్‌ మోడీ అన్నారు. 

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
గత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అదేరోజున ద్రవ్య లోటు, ఇండియా ఇన్ఫ్రా అవుట్‌పుట్‌ డేటా విడుదలకానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల్లో.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్  సీపీఐ, చైనా ఉత్పత్తి డేటా, అమెరికా వ్యక్తిగత వ్యయ సమాచారం వెల్లడికానున్నాయి.

ఆర్థిక ఫలితాల ప్రభావం..
అదానీ పోర్ట్స్, కోల్గేట్‌–పామోలివ్, గెయిల్, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్, ఆయిల్‌ ఇండియా, జీ ఎంటర్‌టై¯Œ మెంట్, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, పీఎన్బీ, సన్ ఫార్మా, ప వర్‌ గ్రిడ్‌ ఫలితాలు ఈవారంలో వెలువడనున్నాయి.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
మే 2–24 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.4,375 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈ కాలంలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,048 కోట్లు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.2,310 కోట్లు ఉపసంహరించుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement