
‘శాంసంగ్’ వారసుడి మెడకు లంచం ఉచ్చు
అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో దక్షిణ కొరియాను కుదిపేస్తున్న రాజకీయ దుమారంలో తాజాగా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వైస్ చైర్మన్ లీ జే–యంగ్ చిక్కుకున్నారు.
సియోల్: అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో దక్షిణ కొరియాను కుదిపేస్తున్న రాజకీయ దుమారంలో తాజాగా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వైస్ చైర్మన్ లీ జే–యంగ్ చిక్కుకున్నారు. అనుమానితుడిగా ఆయన్ను కూడా ప్రశ్నించనున్నట్లు కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక ప్రాసిక్యూటర్ల బృందం ప్రతినిధి వెల్లడించారు. తర్వాత దశలో జే–యంగ్ను అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. శాంసంగ్ చైర్మన్ లీ కున్ హీ కుమారుడైన జే–యంగ్, ఆయన వారసుడిగా కంపెనీ పగ్గాలు చేపట్టనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అనుయాయి చోయ్ సూన్–సిల్ అవినీతి కార్యకలాపాల కారణంగా దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హె ప్రస్తుతం అభిశంసన తీర్మానం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సూన్–సిల్ కార్పొరేట్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి తన ట్రస్ట్లకు విరాళాలు సేకరించారని, ఆ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమ అవసరాల కోసం సూన్–సిల్ ట్రస్ట్లకు విరాళాల రూపంలో లంచాలు ఇచ్చాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో శాంసంగ్ కూడా ఉంది. 2015లో రెండు గ్రూప్ యూనిట్స్ (కెయిల్ ఇండస్ట్రీస్, శాంసంగ్ సీటీ) వివాదాస్పద విలీన ప్రతిపాదన గట్టెక్కించేందుకు, వారసుడిగా జే–యంగ్ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం చేసేందుకు .. శాంసంగ్ కూడా డబ్బు ముట్టచెప్పినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొన్నాళ్లుగా జే–యంగ్తో పాటు కంపెనీకి చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్స్ను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఒత్తిళ్ల కారణంగా తాము విరాళాలు ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ తాము ఎలాంటి ప్రతిఫలం పొందలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.