ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు

Published Wed, Apr 2 2014 1:39 AM

Sebi disclosure norms for mutual funds effective from today

 ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్‌లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

తమ వెబ్‌సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్‌సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా  ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది.  ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్‌లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే.

Advertisement
Advertisement