
సెప్టెంబర్ లో మార్కెట్లోకి రూపే క్రెడిట్ కార్డ్స్!
దేశీ కార్డ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ‘రూపే కార్డ్స్’ మార్కెట్ విస్తరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
ముంబై: దేశీ కార్డ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ‘రూపే కార్డ్స్’ మార్కెట్ విస్తరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అందుకే తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. డెబిట్ కార్డ్ మార్కెట్లో జనవరి నాటికి 38 శాతం వాటాతో తన మార్క్ను నిలుపుకున్న రూపే కార్డ్స్ తాజాగా క్రెడిట్ కార్డ్ మార్కెట్పై కూడా కన్నేసింది. ఇందులో భాగంగానే రానున్న సెప్టెంబర్లో క్రెడిట్ కార్డులను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చి, ఆ విభాగంలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. క్రెడిట్ కార్డుల ఆవిష్కరణ జరిగినప్పటి నుంచి తొలి ఏడాది కాలంలో దాదాపు 1,00,000 కార్డులను జారీ చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
మొదటిగా రెగ్యులర్, ప్లాటినం కార్డులను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మొత్తం కార్డుల బిజినెస్లో వృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటి ని ఒడిసి పట్టుకొని అధిక వాటాను కైవసం చేసుకునే దిశగా పయనిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీఈవో దిలిప్ అస్బె తెలిపారు. 2-3 ఏళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్స్ మార్కెట్ 10 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. 2017 నుంచి ప్రతి ఏడాది 5 లక్షల నుంచి 10 లక్షల క్రెడిట్ కార్డుల జారీ చే యడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య 2.27 కోట్లుగా ఉంది.