
న్యూఢిల్లీ: భారత్లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 7.89 శాతం వృద్ధితో 33 లక్షల యూనిట్ల మార్క్ దగ్గరకు చేరాయి. చిన్న చిన్న పట్టణాల నుంచి డిమాండ్ పెరగడం, యుటిలిటీ వాహనాల పాపులారిటీ దీనికి ప్రధాన కారణం. ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య ‘సియామ్’ తాజా గణాంకాల ప్రకారం..
♦ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు రికార్డ్ స్థాయిలో 32,87,965 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 30,47,582 యూనిట్లుగా ఉన్నాయి.
♦ దేశీ కార్ల విక్రయాలు 3.33 శాతం వృద్ధితో 21,03,847 యూనిట్ల నుంచి 21,73,950 యూనిట్లకు పెరిగాయి.
♦ యుటిలిటీ వెహికల్స్ అమ్మకాల్లో 20.97 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 7,61,998 యూనిట్ల నుంచి 9,21,780 యూనిట్లకు ఎగశాయి.
♦ అయితే ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు మాత్రం 1.51 శాతం క్షీణతతో 7,47,287 యూనిట్లకు తగ్గాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇవి 7,58,727 యూనిట్లుగా ఉన్నాయి.
మంచి పనితీరుతో ముగింపు
గత ఆర్థిక సంవత్సరాన్ని మంచి పనితీరుతోనే ముగించామని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. ప్యాసింజర్ బస్సుల విభాగం మినహా దాదాపు ప్రతి విభాగంలోనూ సానుకూల వృద్ధి నమోదు అయ్యిందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమకు డీమోనిటైజేషన్, బీఎస్–3 నుంచి బీఎస్–4 ప్రమాణాలకు మారడం, జీఎస్టీ అమలు రూపంలో సవాళ్లు ఎదురయ్యాయని వివరించారు. గత 3–4 ఏళ్ల నుంచి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో దాదాపు 50 శాతం వాటాను ఆక్రమిస్తున్న టాప్–20 పట్టణాల్లో వృద్ధి నెమ్మదించిందని గుర్తుచేశారు.
మారుతీ విక్రయాలు... 16,43,467
మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 16,43,467 యూనిట్లుగా నమోదయ్యాయి. 13.84 శాతం వృద్ధి కనిపించింది. మారుతీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 5.21 శాతం వృద్ధితో 5,36,241 యూనిట్లకు పెరిగాయి.