రియల్టీ రంగానికి 2019లో నిరాశే | Realty sector Slowdown in 2019 | Sakshi
Sakshi News home page

రియల్టీ రంగానికి 2019లో నిరాశే

Dec 16 2019 3:24 AM | Updated on Dec 16 2019 3:24 AM

Realty sector Slowdown in 2019 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించ డం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వం టి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగం లో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం 4 శాతం వృద్ధితో 2,58,410 యూనిట్లకు చేరాయి. ఇందులోనూ అందుబాటు గృహాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. అఫడబు ల్‌ హౌసింగ్‌లకు పలు పన్ను రాయితీలను కల్పించ డమే ఇందుకు కారణం. తొలిసారి గృహ కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల పన్ను రాయితీని అందిస్తుంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అందుబాటులో ఉంటుంది.

రెడీ టు మూవ్‌ గృహాలకే డిమాండ్‌..
రియల్‌ ఎస్టేట్‌ రంగం పనితీరు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల క్రితం నాటికి క్షీణించి 4.5 శాతానికి చేరింది. ముంబై, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో డిమాండ్‌ కనిపించింది.. కానీ, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ తిరోగమన బాట పట్టిందని చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా 6 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్ల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. లిస్టెడ్, బ్రాండెడ్‌ నిర్మాణ సంస్థలు మాత్రం గృహ విక్రయాల్లో కాసింత ఉపశమనంలో ఉన్నాయి. ఈ ఏడాది గృహ విభాగానికి కలిసొచ్చిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్ల ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌)ను ఏర్పాటు చేయడమే.

Advertisement
 
Advertisement
Advertisement