డీమ్యాట్‌తో బహుళ ప్రయోజనాలు | Probe to find if Sharepro scam extended to demat | Sakshi
Sakshi News home page

డీమ్యాట్‌తో బహుళ ప్రయోజనాలు

Jul 4 2016 1:11 AM | Updated on Sep 4 2017 4:03 AM

‘దేశ జనాభా 121 కోట్లు దాటింది. బ్యాంకు ఖాతాలు 46 కోట్లు. సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల పైనే.

సాక్షి మదుపరుల అవగాహన సదస్సులో సీడీఎస్‌ఎల్ ఆర్‌ఎం
సాక్షి, విశాఖపట్నం: ‘దేశ జనాభా 121 కోట్లు దాటింది. బ్యాంకు ఖాతాలు 46 కోట్లు. సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల పైనే. అయితే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.50 కోట్లే. స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డిమ్యాట్ ఖాతానే. దీనివల్ల బహుళ ప్రయోజనాలున్నాయి.’ అని   సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ అన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆదివారం విశాఖలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సులో ఆయన  పలు విలువైన సూచనలు అందించారు.

ఆదాయపు పన్నుశాఖ జారీ చేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు వీలుందని, ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపర్చుకోవచ్చని వివరించారు. డీమ్యాట్ ఖాతాదారులు తప్పనిసరిగా నామినీని పేర్కొనాలని,  అనుకోనిదేదైనా జరిగితే ఖాతాలో ఉన్న షేర్లను నామినీ ఖాతాలోకి వెంటనే బదిలీ చేయవచ్చన్నారు.
 
స్టాక్ మార్కెట్‌లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కన్నా అధికంగానే రాబడి ఉంటుందని, చిన్న వయసు నుండే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏపీ, తెలంగాణా హెడ్  టి.విజయకుమార్, షేర్‌ఖాన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కృష్ణమూర్తి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మదుపు ప్రయోజనాలను వివరించారు. సదస్సులో అధిక సంఖ్యలో మదుపరులు పాల్గొన్నారు. తమ సందేహాలను మదుపరులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement