అదేపనిగా ఫోన్‌ వాడితే.. దానికి సమానమట | NeuroRegulation Study Says Smartphone Usage Creates Loneliness | Sakshi
Sakshi News home page

అదేపనిగా ఫోన్‌ వాడితే.. దానికి సమానమట

Apr 12 2018 6:23 PM | Updated on Mar 23 2019 7:54 PM

NeuroRegulation Study Says Smartphone Usage Creates Loneliness - Sakshi

న్యూయార్క్‌ : మీరు స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నట్లయితే ఇది చదవాల్సిందే. ఓ రకంగా ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని చిన్నదిగా మార్చివేసింది.. చిన్నా..పెద్దా అందరూ స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్న వైనాన్ని చూస్తున్నాం.. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం  మనుషుల మధ్య మాటల్ని మాయం చేస్తోంది.. అనుబంధాల మధ్య గోడలు కట్టేస్తోంది.  స్మార్ట్‌ఫోన్‌  మోజులో   యూజర్లు సోషల్‌ సైట్లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారట. ఇది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను న్యూరోరెగ్యులేషన్‌ జర్నల్‌ ప్రచురించింది. ఇందుకోసం సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయిన 135మందిని ఎంచుకొని వారి మానసిక పరిస్థితిపై అధ్యాయనం చేశారు. ఇందులో భయంకరమైన  విషయాలు వెలుగుచూశాయి.

అవసరం కోసం కొద్ది సమయం స్మార్ట్‌ఫోన్‌పై వెచ్చించడం పెద్ద ముప్పు కాకపోవచ్చు కానీ, మరీ ఎక్కువ సమయం అదే పనిగా వాటిపై దృష్టి కేంద్రీకరించడం మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వారి ఆలోచన పరిధి తగ్గడమే కాకుండా, పెయిన్‌ కిల్లర్‌కు బానిసగా మారడంతో సమానమని  తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగించేవారిలో ఆత్రుత, ఒంటరితనం, ఒత్తిడి పెరుగుతుందని.. ఇది దీర్ఘకాలంలో మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని  రిపోర్ట్‌ చేసింది. ఒక పనిచేసేటప్పుడు మానవ మెదడులోని ఒక భాగం యాక్టివ్‌గానూ , మరోభాగం విశ్రాంతి తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది వేరొక పనిచేస్తూ కూడా స్మార్ట్‌ఫోన్‌లు వాడటం మెదడును ఒత్తిడికి గురిచేస్తుంది. సహజ సిద్ధంగా ఉన్న వ్యవహారశైలితోపాటు, చాలా విషయాల్లో వారికి తెలియకుండానే మార్పులు చోటుచేసుకుంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో నిరంతరం నెట్‌ అన్‌లో ఉండటం వల్ల రేడియేషన్‌ సమస్యలు కూడా ఎదురవుతాయని ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement