
స్టార్టప్లకు ముఖేష్ అంబానీ ఊతం
ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ చిరువ్యాపారులు, స్టార్టప్ కంపెనీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్టప్లకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమటెడ్ (ఆర్ఐఎల్) 42 వ ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఈ విషయం వెల్లడించారు. అలాగే, ఉచితంగా 5 లక్షల కుటుంబాలకు జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందిస్తామన్నారు. ఇక నెలకు 500 రూపాయలతో ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ అత్యధికంగా రూ 67,000 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు.