నిధుల లభ్యత సులభం కావాలి | Kelkar Committee, Infra-owned company | Sakshi
Sakshi News home page

నిధుల లభ్యత సులభం కావాలి

Dec 29 2015 5:10 AM | Updated on Sep 3 2017 2:42 PM

నిధుల లభ్యత సులభం కావాలి

నిధుల లభ్యత సులభం కావాలి

అరకొర మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధికి అవరోధాలుగా మారిన నేపథ్యంలో ఇన్‌ఫ్రా రంగానికి ఊతమిచ్చేలా తీసుకోవాల్సిన...

* ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులకు ప్రత్యేక చ ట్టం చేయాలి
* స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు అవసరం
* ఇన్‌ఫ్రా రంగ సంస్కరణలపై కేల్కర్ కమిటీ సిఫార్సులు

న్యూఢిల్లీ: అరకొర మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధికి అవరోధాలుగా మారిన నేపథ్యంలో ఇన్‌ఫ్రా రంగానికి ఊతమిచ్చేలా తీసుకోవాల్సిన పలు చర్యలను అత్యున్నత స్థాయి కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు (పీపీపీ) నిధుల లభ్యత సులభతరంగా ఉండేలా చూడాలని పేర్కొంది.

వైద్యం, పట్టణ ప్రాంతాల్లో రవాణా తదితర విభాగాల్లో చేపట్టే ఇటువంటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని సూచించింది. అలాగే వివాదాల పరిష్కారానికి ట్రిబ్యున ల్‌నూ ఏర్పాటు చేయాలని పేర్కొంది.  ఎనిమిది మంది సభ్యులతో కూడిన విజయ్ కేల్కర్ కమిటీ గత నెల సమర్పించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. మోడల్ కన్సెషన్ ఒప్పందాలను సమీక్షించాలని, జీరో కూపన్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకునేందుకు అనుమతులివ్వాలని కమిటీ ఇందులో సూచించింది.

అలాగే, ఆయా ప్రాజెక్టులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ (ఐపీఆర్‌సీ)ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.  దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యేందుకు ఇన్‌ఫ్రా రంగ పీపీపీ ప్రాజెక్టులు కీలకపాత్ర పోషించగలవని కేల్కర్ కమిటీ వివరించింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను రూపొం దించడం అత్యవసరమని పేర్కొంది.

రిస్కులు ఎదురైతే ఏ పక్షం ఎంత భరించాల్సి ఉంటుందనేది స్పష్టంగా ముందుగానే గుర్తించాలని, పీపీపీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా సేవలను అందుబాటులోకి తేవడమే కీలకం కావాలని కమిటీ సూచించింది.
 
మరిన్ని సిఫార్సులు..
* మాజీ సుప్రీం కోర్టు జడ్జి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సారథ్యంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ అడ్జుడికేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఇందులో సాంకేతిక, ఆర్థిక నిపుణులు ఉండాలి.
* ఐపీఆర్‌సీలో ఆర్థిక శాస్త్ర నిపుణులతో పాటు రంగానికి సంబంధించిన నిపుణులు (ఇంజినీర్లు), న్యాయ శాస్త్ర నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉండాలి.  
* పీపీపీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే విషయానికి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జీరో కూపన్ బాండ్లను జారీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతివ్వాలి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement