భారత్‌ ఎకానమీ అస్తవ్యస్తం | Indian economy in deep trouble | Sakshi
Sakshi News home page

భారత్‌ ఎకానమీ అస్తవ్యస్తం

Jun 27 2020 5:40 AM | Updated on Jun 27 2020 5:40 AM

Indian economy in deep trouble - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 5% క్షీణిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ కట్టడిలో కష్టాలు, విధాన పరమైన నిర్ణయాల అమల్లో జాప్యం, పైనాన్షియల్‌ రంగంసహా పలు విభాగాల్లో అనిశ్చితి ధోరణి వంటి అంశాలు దీనికి కారణం.

అయితే బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా 2021–22లో ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని అంచనావేసింది. కరోనా ఎఫెక్ట్‌తో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతం మూడు ట్రిలియన్‌ డాలర్లను నష్టపోయే వీలుందని తెలిపింది. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ 2020లో 1.3 శాతం నష్టపోతుందని అయితే 2021లో 6.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని పేర్కొంది. కాగా చైనా ఆర్థికాభివృద్ధి 2020, 2021ల్లో వరుసగా 1.2 శాతం, 7.4 శాతాలుగా నమోదవుతాయని అంచనావేసింది.

డీ అండ్‌ బీ చెప్పింది ఇదే: దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు, కోవిడ్‌–19 కేసులు పెరుగుతుండడం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ డీ అండ్‌ బీ పేర్కొంది. ఇక సరఫరాల చైన్‌ దెబ్బతింటే ఆహార ధరలూ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యవస్థలో డిమాండ్‌ మందగమనం కొనసాగుతుందని, వలస కార్మికుల కొరత కారణంగా కంపెనీలకు ప్రత్యేకించి లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement