
వచ్చే ఏడాది మార్చి నాటికి పోస్టల్ చెల్లింపుల బ్యాంకు
వచ్చే ఏడాది మార్చి నాటికల్లా పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కార్యకలాపాలు ప్రారంభం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కార్యకలాపాలు ప్రారంభం కాగలవని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే దీనికి సూత్రప్రాయ ఆమోదం లభించినందున త్వరలో క్యాబినెట్ ముందు కూడా ఈ ప్రతిపాదన ఉంచనున్నట్లు మంగళవారం డిజిటల్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. బ్యాంకింగ్, బీమా పథకాలు మొదలైన వాటి డెలివరీ సేవల కోసం థర్డ్ పార్టీగా ఇండియా పోస్ట్తో చేతులు కలిపేందుకు దాదాపు 60 పైగా అంతర్జాతీయ కన్సార్షియంలు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోర్ బ్యాంకింగ్ విధానాలు పాటిస్తున్న ఇండియా పోస్ట్ శాఖలు 2014లో కేవలం 230 మాత్రమే కాగా ప్రస్తుతం 20,494 పైచిలుకు శాఖలకు వీటిని విస్తరించినట్లు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ నాటికి మొత్తం 25,000 శాఖల్లోనూ కోర్ బ్యాంకింగ్ విధానాలను అమల్లోకి తెస్తామన్నారు.