హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ డివిడెంట్‌

HDFC Bank Net Profit Jumps 20 Percent, Shareholders To Get 650% Dividend - Sakshi

ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్‌ ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 20 శాతం జంప్‌ చేసి రూ.4799 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. కాగ గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.3990 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ డివిడెంట్‌ ప్రకటించింది. 2 రూపాయల గల ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెంట్‌ ఇచ్చేందుకు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఇది షేర్ల ఫేస్‌ విలువకు 650 శాతం అధికం. గతేడాది ఇదే క్వార్టర్‌లో 11 రూపాయల డివిడెంట్‌ ప్రకటించింది. 

వచ్చే వార్షిక సాధారణ సమావేశంలో పెట్టుబడిదారులు దీన్ని ఆమోదించనున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.4,838 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. కానీ  విశ్లేషకుల అంచనాలకు కాస్త దగ్గర్లోనే బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర ఆదాయాలు ఏడాది ఏడాదికి 17.7 శాతం పెరిగి రూ.10,657.71 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.30 శాతంగా ఉన్నాయి. అంతేకాక నికర ఎన్‌పీఏలు గత డిసెంబర్‌ క్వార్టర్‌లో 0.44 శాతంగా ఉంటే, ఈ మార్చి క్వార్టర్‌లో 0.40 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా శుక్రవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 0.98 శాతం పెరిగి, రూ.1,960.95 వద్ద ముగిశాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top