'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'

'Government doesn't want Air India to go Kingfisher way, lose jobs' - Sakshi

న్యూఢిల్లీ : లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్‌ ఏవియేషన్‌ మంత్రి అశోక్‌ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్‌ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్‌ క్యారియల్‌ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు.

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు.  జూన్‌ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్‌ గణపతి రాజు పేర్కొన్నారు.  ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్‌ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top