సంస్కరణలతో ఆశించిన ఫలితాలు:ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల కట్టలు బ్యాంకుల్లోకి వచ్చినట్టు చెప్పారు. ‘‘మొత్తం నగదును బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే నోట్ల రద్దు ఉద్దేశ్యం. అది చాలా వరకు నెరవేరింది’’అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్లిస్టెడ్ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది.
మరిన్ని వార్తలు