‘గరీబ్‌ కల్యాణ్‌’ అందరికీ కాదు.. | CBDT Explanatory Notes on 'Pradhan Mantri Garib Kalyan Yojana 2016' | Sakshi
Sakshi News home page

‘గరీబ్‌ కల్యాణ్‌’ అందరికీ కాదు..

Dec 29 2016 1:28 AM | Updated on Sep 22 2018 8:25 PM

‘గరీబ్‌ కల్యాణ్‌’ అందరికీ కాదు.. - Sakshi

‘గరీబ్‌ కల్యాణ్‌’ అందరికీ కాదు..

నల్లకుబేరులకు సంబంధించి కేంద్రం తాజాగా, చివరి అవకాశంగా ప్రకటించిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం అందరికీ వర్తించబోదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

దరఖాస్తుకు ముందే పన్ను, లాక్‌–ఇన్‌ మొత్తం చెల్లించాలి...
అవినీతి, కేసులు, అక్రమ ధనార్జన, డ్రగ్స్‌ అక్రమ రవాణా వంటి కేసుల్లో ఉన్నవారికి ఇది వర్తించదు
కొత్త ఆదాయ వెల్లడి స్కీమ్‌పై సీబీడీటీ వివరణ


న్యూఢిల్లీ: నల్లకుబేరులకు సంబంధించి కేంద్రం తాజాగా, చివరి అవకాశంగా ప్రకటించిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం అందరికీ వర్తించబోదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన, 2016కు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఈ మేరకు వివరణలతో తాజా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. దరఖాస్తులో ఇలా పన్ను చెల్లించినట్లు ఆధారం ఉండాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో  25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్‌–ఇన్‌’ విధానంలో డిపాజిట్‌ చేయాలి.  కట్టిన పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం జరగదు.

అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్‌ బ్లాక్‌ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు.

స్పెషల్‌ కోర్ట్‌ (సెక్యూరిటీ లావాదేవీల సంబంధ ఆరోపణల విచారణ) యాక్ట్, 1992, సెక్షన్‌ 3 కింద నోటిఫై చేసిన ఏ వ్యక్తీ ఈ పథకం పరిధిలోకి రాబోడు.

వెల్లడించిన సొమ్ము పైన పేర్కొన్న అంశాల పరిధిలోకే వస్తుందని, సంబంధిత డిక్లరెంట్‌ కీలకమైన కొన్ని అంశాలు దాచిపెట్టాడని  తదుపరి ఏ సందర్భంలోనైనా రుజువైతే... తగిన చట్టపరమైన చర్యలన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది.

డిసెంబర్‌ 17న ప్రారంభమైన ఈ పథకం డిక్లరేషన్లు, డిపాజిట్ల నిమిత్తం 2017 మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది.  

ఇన్‌ ప్రింట్‌ లేదా డిజిటల్‌ సిగ్నేచర్‌ కింద ఎలక్ట్రానికల్‌గా ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌కు లేదా ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌కు డిక్లరేషన్‌ ఇవ్వవచ్చు. తరువాత 30 రోజుల్లో పన్ను అధికారులు ఇందుకు సంబంధించి డిక్లరెంట్‌కు ఒక సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

ఈ పథకం కింద నల్లధనాన్ని ప్రకటించని వారు అటు తర్వాత ట్యాక్స్‌ రిటర్న్‌ రూపంలో ఆ మొత్తాన్ని వెల్లడించవచ్చు. అయితే ఇందుకు సంబంధించి మొత్తం 77.25 శాతం పన్ను, జరిమానాలుగా చెల్లించాలి. ఈ రెండు పథకాలనూ వినియోగించుకోకపోతే.. పట్టుకున్న మొత్తంలో పన్నుతో పాటు ఆ మొత్తంలో 10 శాతం జరిమానా పడుతుంది. సంబంధిత వ్యక్తి ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement