ఆ రెండ్రోజులు బ్యాంకులు పనిచేయవు..
కోల్కతా : వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు ముందుకు సాగకపోవడంతో ఈనెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. డిమాండ్ల సాధన కోసం మరోసారి మార్చి 11 నుంచి 13 వరకూ సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (యూఎఫ్బీయూ) వెల్లడించింది. అప్పటికీ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూఎఫ్బీయూ పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సిద్ధార్ధ ఖాన్ వెల్లడించారు.
కాగా యూఎఫ్బీయూ 15 శాతం వేతన పెంపును కోరుతుండగా ఐబీఏ 12.25 శాతం మేరకే పెంపును పరిమితం చేస్తోందని ఇది తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు. నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.