అగ్రిగోల్డ్ బాధితులకు కోసం ఎందాకైనా..
బాధితులకు బాసటగా నిలిచి ఆత్మహత్యలను నివారిద్దాం
పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతీయ సమావేశంలో నిర్ణయం
హాజరైన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు
సాక్షి, అమరావతి: తీవ్ర మానసిక వేదనతో కుమిలిపోతున్న అగ్రిగోల్డ్ పాలుకావడంతో బాధితులకు న్యాయం జరిగేలా అండగా నిలిచి ఎందాకైనా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం ఉద్ఘాటించింది. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బాసట కమిటీ అసెంబ్లీ నియోకవర్గాల కో– ఆర్డినేటర్లు హాజరయ్యారు.
బాసట కమిటీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్యపై రాజకీయ కోణంలో కాకుండా, వారికి న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే తమ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ కావాలనే కాలయాపన చేసిందని, ఎన్నికల ముందు మళ్లీ బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
బాధితులకు బాసటగా నిలుద్దామని, వారిలో ఆత్మస్థైర్యం నింపడం ద్వారా ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు అసెంబ్లీ కో– ఆర్డినేటర్లు మాట్లాడుతూ జనవరి 3వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేసేలా శ్రేణుల్ని సమాయత్తం చేస్తామన్నారు. బాధితుల్ని కలసి ధర్నాలో పాల్గొనేలా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా ఆహ్వానిస్తామని, బాధితులకు న్యాయం జరుగుతుందంటే అన్ని సంఘాలతోనూ కలిసి పోరాడాతామని వారు ప్రకటించారు.
ప్రభుత్వం స్పందించకపోతే పాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని, ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ కో– ఆర్డినేటర్లు రావూరి వీరవెంకట సత్యదుర్గాప్రసాద్(ఏలూరు), కొఠారి శ్రీనివాస్(మచిలీపట్నం), అడపా శేషు(విజయవాడ), మర్రి సుబ్బారెడ్డి(నరసరావుపేట), వనమా బాల వజ్రబాబు(గుంటూరు), చేజర్ల నారాయణరెడ్డి(బాపట్ల) మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కో– ఆర్డినేటర్లు రాయప్రోలు శ్రీనివాసమూర్తి(భీమవరం), బాలం వెంకటేశ్వరరావు(గోపాలపురం), ఆర్.సూర్యనారాయణ(నిడదవోలు), కడియాల సూర్యనారాయణ(తణుకు), చింతకాయల సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), గాజుల వెంకటేశ్వరరావు(ఉంగుటూరు), టి.నాగమురళి(దెందులూరు), బాలేపల్లి నాగరాజు(చింతలపూడి) తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన చక్కా జగన్మోహనరావు(కైకలూరు), ఎండీ హాఫీజు రెహమాన్(మచిలీపట్నం), బంక ప్రసాద్(తిరువూరు), బొడ్డు అప్పలనాయుడు(విజయవాడ తూర్పు), లింగాల నిరిక్షణంకుమార్(మైలవరం), ముత్యాల వెంకటచలం(జగ్గయ్యపేట) మాట్లాడారు. గుంటూరు జిల్లాకు చెందిన టి.బ్రహ్మారెడ్డి(తాడికొండ), బొమ్మ నాగిరెడ్డి(తెనాలి), మామిడి రాము(గుంటూరు పశ్చిమ), ఈర్ల శివరామకృష్ణ (పెద్దకూరపాడు), సీహెచ్. పుల్లారెడ్డి(వినుకొండ), ఎన్.సత్యనారాయణ(గురజాల), కె.చంద్రశేఖర్(మాచర్ల), సన మహేందర్(బాపట్ల) ప్రసగించారు.