నగరి మున్సిపల్ చైర్ పర్సన్ కు పెద్దిరెడ్డి పరామర్శ | ysrcp mla peddireddy ramachandrareddy visits nagari muncipal chair person santha kumari | Sakshi
Sakshi News home page

నగరి మున్సిపల్ చైర్ పర్సన్ కు పెద్దిరెడ్డి పరామర్శ

Jul 4 2016 8:45 AM | Updated on Aug 10 2018 9:23 PM

రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు.

తిరుపతి: రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా రెండేళ్లలో దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్పై పోలీసులు సమక్షంలోనే దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ కె.శాంతకుమారిపైన దౌర్జన్యానికి దిగారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ మోకాళ్లతో కడుపులో బలంగా పొడిచారు. దీంతో కిందపడిపోయిన చైర్‌పర్సన్ స్పృహ కోల్పోయారు.  ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నగరి మున్సిపాల్టీలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ నేపథ్యంలో ఈ అమానుష చర్యలు చోటు చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement