
వైఎస్సార్సీపీని పటిష్టం చేద్దాం
నాయకులు, కార్యకర్తలు అందరం సమన్వయంతో పనిచేసి వైఎస్సార్ సీపీని పటిష్టం చేద్దామని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.
సాక్షి, రాజమండ్రి : నాయకులు, కార్యకర్తలు అందరం సమన్వయంతో పనిచేసి వైఎస్సార్ సీపీని పటిష్టం చేద్దామని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమండ్రి ఆర్అడ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని పటిష్టం చేసేందుకు ఈ నెల 19 నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 15 నియోజకవర్గాల్లో వాటిని పూర్తిచేశామని వెల్లడించారు. ఇకపై పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీల నియామకాలను నెలాఖరులోగా పూర్తిచేస్తామని, గ్రామ, వార్డు స్థాయి కమిటీలను కూడా ఆ తరువాత నియమిస్తామని చెప్పారు. జిల్లాలో రైతాంగ సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఏలేరు ఆధునికీకరణను ప్రభుత్వం మరుగునపడేసిందని విమర్శించారు.
కేఎస్ఈజెడ్పై మాటమార్చారు
కాకినాడ సెజ్(కేఎస్ఈజెడ్)ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వ్యతిరేకించిందని, ఇప్పుడు దానికి అనుకూలంగా మాట్లాడుతుందని, ఇదేం వైఖరి అని ప్రశ్నించారు. జిల్లాలోనే ఉన్న ఆర్థిక మంత్రి కేఎస్ఈజెడ్కు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయంటూ కొత్త పల్లవి అందుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సెజ్ల వల్ల రైతులు భూములు కోల్పోతున్నారంటూ గగ్గోలు పెట్టిన నాటి నేతలేనా వీళ్లంటూ ఎత్తిచూపారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.131 కోట్లు కూడా ఇవ్వదని, కేవలం రూ.31 కోట్లు చెల్లించి మిగిలిన రూ. 100 కోట్లు దేవాదాయ శాఖ ఆదాయంలో ఖర్చు చేసే ఆలోచనలో ఉందని విమర్శించారు.
ఇసుక దందాపై సీబీఐ విచారణ అవసరం
ఇసుక అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని జ్యోతుల డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో అధికారపార్టీ నేతలకూ ప్రమేయం ఉందని విమర్శించారు. సీతానగరం మండలంలో వెలు గు చూసిన అక్రమాల్లో అమాయకులు బలి కాకుండా అసలైన అక్రమార్కులను పట్టుకుని శిక్ష వేయించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాల న్నారు. ఇసుక అక్రమాల విషయంలో పత్రికల పాత్ర అభినందనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, రాజమండ్రి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిల, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని నెహ్రూను కలుసుకున్నారు.