పెరుగుతున్న ధరలు పేదల బతుకులను దుర్భరం చే స్తున్నాయి...
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన ఆందోళనలు
ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం
ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన
జిల్లా వ్యాప్తంగా ధర్నాలు
పెరుగుతున్న ధరలు పేదల బతుకులను దుర్భరం చే స్తున్నాయి... వాటిని కట్టడి చేసి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది.. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి నెలకొంది. పండుగ పూట సైతం పచ్చడి మెతుకులు తప్పడం లేదు.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ.. ప్రజల తరఫున ధరల పెరుగుదలపై యుద్ధం మొదలెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వ వైఫలాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు మేల్కొని ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి పేదలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలను సమీకరించి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాల పేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆర్కె.రోజా ఆధ్వర్యంలో ఎంపీపీ మురళీధర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్రాజు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు.
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. పార్టీ నేతలు బీరేంద్రవర్మ, మల్లం రవిచంద్రారెడ్డి, రాజేంద్ర, ఎంవీఎస్ మణి, మమత తదితరులు పాల్గొన్నారు.చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, రామసముద్రం ఎంపీపీ జరీనా, కార్యకర్తలు పాల్గొన్నారు.పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐరాల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కన్వీనర్ల ఆధ్వర్యంలో తహశీల్దార్ల కార్యాయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలమనేరులో టౌన్ కన్వీనర్ హేమంత్కుమార్రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ బాలాజీరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు.సత్యవేడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట కన్వీనర్ ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. డెప్యూటీ తహశీల్దార్ కిరణ్మయికి వినతి పత్రం సమర్పించారు.
పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.కుప్పం నియోజకవర్గపరిధిలోని రామకుప్పంలో కన్వీనర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టారు. గంగాధర నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట కన్వీనర్ వెంకటేశ్వర్లురెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.చిత్తూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నగర కన్వీనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.