
సాక్షి, హైదరాబాద్: కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యపై జోక్యం చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు బుధవారం లేఖ రాశారు.
'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎమ్సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నో ఆశలతో మెడిసిన్ పూర్తి చేయాలనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. ఇతర కాలేజీల్లో ఫాతిమా విద్యార్థులకు అవకాశమివ్వండి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలని' వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
@JPNadda ji, urging your intervention on Fathima Medical college students' plight, to save their future. pic.twitter.com/OixkJJRacl
— YS Jagan Mohan Reddy (@ysjagan) 15 November 2017