
రుణమాఫీ కోసం నిరాహార దీక్షకు సైతం రెడీ
రైతు రుణమాఫీ కోసం నిరాహార దీక్షకు సైతం సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
శ్రీకాకుళం : రైతు రుణమాఫీ కోసం నిరాహార దీక్షకు సైతం సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి కమిటీల పేరుతో కాలయాపన చేయటమేంటని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడు కరువొచ్చినా... వరదొచ్చినా ప్రభుత్వాలు రుణాలు రీ షెడ్యూల్ చేయటం కొత్తేమి కాదన్నారు. ఇటీవల చెన్నైలో భవనం కప్పుకూలిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయనకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రుణమాఫీని నమ్మి నిండా మునిగిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీ హామి ఇచ్చామన్న చంద్రబాబు వ్యాఖ్యలను వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించింది మీరు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రుణమాఫీని విస్మరించి రీ షెడ్యూల్ చేసామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ విమర్శించారు. రుణమాఫీపై కాలయాపన చేసేందుకే కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. రైతులకు మేలు చేయాలన్న ఆలోచన, సంకల్పం, చిత్తశుద్ధి మీకుందా అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
కడుపు మాడిన రైతు పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా చంద్రబాబు అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతుల కోసం నిరాహార దీక్షకు సైతం వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. రుణమాఫీ కోసం నిరాహార దీక్షకు సైతం సిద్ధమన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి కమిటీల పేరుతో కాలయాపన చేయటమేంటని జగన్ ప్రశ్నించారు.