యానాదుల అభివృద్ధికి కృషి | Yanadula development effort | Sakshi
Sakshi News home page

యానాదుల అభివృద్ధికి కృషి

Apr 10 2016 1:15 AM | Updated on Sep 3 2017 9:33 PM

యానాదుల సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని

తాడేపల్లిగూడెం రూరల్ : యానాదుల సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. మండలంలోని పడాల మార్కెట్ యార్డులో శనివారం జరిగిన యానాదుల ఐక్యగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ తరహా విధానాలను అనుసరించడం వల్ల పేదలంతా పేదలుగానే మిగిలిపోయారన్నారు. యానాదుల జాతి గుర్తింపునకు, రక్షణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు.

 పేదలు ఉన్నత విద్యావంతులైనప్పుడే అసమానతలు తొలగుతాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యానాదుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. బీసీ జాబితాలోని ఉపకులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు.

తొలుత గొల్లగూడెం సెంటర్ నుంచి యానాదులు ర్యాలీగా పడాల మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన మహాసభలో గ్రేహౌండ్స్ ఎస్పీ వెంకటేశ్వర్లు, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాస్, మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, పడాల మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్‌చౌదరి, సినీ కళాకారుడు పి.ఆంజనేయులు తదితరులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement