రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీమాంధ్ర న్యాయవాదులు స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీమాంధ్ర న్యాయవాదులు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు మెహిదీపట్నం గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో సమావేశమయ్యారు. సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించి.. వాటర్ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు.
రాష్ట్ర విభజన అవసరం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఈ సందర్భంగా న్యాయవాదులు అన్నారు. హైకోర్టు బెంచ్ను ఆంధ్రాలోనూ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో మేధావులు లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత సీమాంధ్రలో మేధావులు ఉన్నారో లేదో కేటీఆర్కు తెలుస్తుందని తెలిపారు. త్వరలో ఢిల్లీ కోటను ముట్టడిస్తామని, సోనియాకు సమైక్యరాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తామని అన్నారు. మనుషులను మనుషుల్లా చూడటం కేసీఆర్ నేర్చుకోవాలని, ఆయన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని తెలిపారు. తాము శాంతియుతంగానే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.