ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాలి

Votes Counting Will Be Transparency - Sakshi

సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. స్థానిక ఏ1 కన్వెన్షన్‌ హాలులో కౌంటింగ్‌ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్లు, నోడల్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి విధివిధానాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతిది ప్రత్యేకమైన నిర్వహణ క్రమం ఉంటుందని, వాటిని అనుసరించాలన్నారు. ప్రతి టేబుల్‌లో ప్రతి ఓటు ప్రాధాన్యం కలిగి ఉందనేది తెలుపుతూ ప్రతి రైండు టేబుల్‌ వారీగా అభ్యర్థుల వారీగా కంట్రోలు యూనిట్‌లో పోలైన ఓట్లు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. నోటా కూడా రికార్డు చేయాలని సూచించారు. కంట్రోలు యూనిట్‌లో నమోదైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు, ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవస్థ ద్వారా వచ్చిన వాటిని లెక్కిస్తామన్నారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించేందుకు రెండు టేబుళ్లను ఏర్పాటు చేశామని, ప్రతి రౌండుకు 500 పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి గిద్దలూరు అసెంబ్లీకి 4 టేబుళ్లు, ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి 4 టేబుళ్లు, బాపట్ల పార్లమెంట్‌కు 4 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన ప్రొఫార్మాలో పోలైన ఓట్లు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు సూపర్‌వైజర్లు కౌంటింగ్‌ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రత్యేక కలెక్టర్‌ చంద్రమౌళి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్లు నూరుశాతం అప్రమత్తంగా ఉండి పోలైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ప్రతిస్థాయిలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు డేటా తేడా లేకుండా సరిగా ఉండాలన్నారు. దీనిలో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించారు. శిక్షణలో సంయుక్త కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top