గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు | Visakhapatnam Gas Leak : Death Toll Touches 12 | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు

May 8 2020 10:19 AM | Updated on May 8 2020 12:10 PM

Visakhapatnam Gas Leak : Death Toll Touches 12 - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన్‌ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్‌ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఘటన సంబంధించి మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను సమీక్ష నిర్వహించారు. (చదవండి : విషవాయువు పీల్చి 10 మంది మృతి)

మరోవైపు నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గత రాత్రి జరిగిన పరిణామాలపై ఈ సందర్భంగా  చర్చించనున్నారు. కేజీహెచ్‌తో పాటు పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రుల బృందం పరామర్శించనుంది. అలాగే బాధిత ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మంత్రుల బృందం ఆయా గ్రామాలలో పర్యటించే అవకాశం ఉంది. 

స్టైరీన్‌ బ్యాంకర్‌లో తగ్గుముఖం పట్టిన ఉష్టోగ్రత
ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ బ్యాంకర్‌లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. పుణె, నాగపూర్‌ నుంచి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. పూర్తిస్థాయిలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే గ్యాస్‌ తీవ్రత తగ్గిన తర్వాత ప్రజలను ఇళ్లలోకి అనుమతించే అవకాశం ఉంది. (చదవండి : విశాఖ దుర్ఘటన; దర్యాప్తునకు సహకరిస్తాం)

Advertisement
 
Advertisement
Advertisement