తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులివ్వటంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
విడపనకల్లు (అనంతపురం) : తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులివ్వటంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామానికి చెందిన 29 మంది ఎస్సీలకు ప్రభుత్వం సాగుభూమిని పంపిణీ చేసింది. అయితే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేయాలంటూ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు.
దీనిపై వారంతా ఆగ్రహం చెంది ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విడపనకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట 42వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. దీంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు.