విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు | two people were arrested on power theft | Sakshi
Sakshi News home page

విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

Nov 26 2013 11:25 PM | Updated on Sep 2 2017 1:00 AM

విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.పిచ్చయ్య తెలిపారు.

సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్:  విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.పిచ్చయ్య తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరుల ఎదుట నిందితులను హాజరుపర్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...అందోల్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఇటిక్యాల పోచయ్య రూ.25,848, పోసానిపేటకు చెందిన గాండ్ల దశరథ్ రూ.28,160 ట్రాన్స్‌కోకు బకాయి ఉన్నారు. దీంతో అధికారులు వీరి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే వీరిద్దరూ బకాయి చెల్లించకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు.

ఇది గమనించిన ట్రాన్స్‌కో అధికారులు గత నెల వీరిని తొలి తప్పు కింద మందలించి వదిలివేశారు. అయితే వీరు బకాయి చెల్లించకపోగా, ఇటీవల రెండోసారి కూడా విద్యుత్ చౌర్యం చేస్తూ ట్రాన్స్‌కో అధికారులకు దొరికిపోయారు. వీరిని అరెస్టు చేసిన ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.పిచ్చయ్య విద్యుత్ శాఖ చట్టప్రకారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. వినియోగదారులు ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ పిచ్చయ్య హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ గోవిందు, కానిస్టేబుళ్లు పరమేష్, శ్రీధర్‌గౌడ్, మస్తాన్‌పాష పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement