సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ను మరో మూడు నెలల్లో తమిళ్, కన్నడ, హిందీ భాషలలో కూడా ప్రారంబిస్తామని ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కూడా ప్రారంభించామన్నారు. 2018 జనవరికి సంబంధించి ఆర్జిత సేవ టిక్కెట్ల ఆన్లైన్ జారీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 17, 24 తేదీలలో వృద్దులు, దివ్యాంగులు నాలుగు వేలమందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. 18, 25 తేదీలలో ఐదు సంవత్సరాల లోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు రెండు వేలమందిని అనుమతిస్తామని వివరించారు.
కాగా, బ్రహ్మోత్సవాలలో వాహన సేవల ఊరేగింపు సమయం మార్పుపై చర్చిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా జనవరి నెలకి 50,879 ఆర్జితసేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. లక్కీ డిప్ కింద 6,744 టికెట్స్, జనరల్ కేటగిరీ కింద 44,135 టికెట్స్ విడుదల చేశారు.