గిరిజన ఆశ్రమ పాఠశాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. మండలంలో పెద్దలక్ష్మీపురంలో గిరిజన బాలుర వసతి గృహం ఉండగా,
మెళియాపుట్టి: గిరిజన ఆశ్రమ పాఠశాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. మండలంలో పెద్దలక్ష్మీపురంలో గిరిజన బాలుర వసతి గృహం ఉండగా, నేలబొంతు, భరణికోట, పెద్దమడి, బందపల్లిలో బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వసతి గృహల్లో రెండేళ్లుగా ఫలితాలు బాగున్నా, మౌలిక సౌకర్యాల్లో వెనుకబాటుగా ఉన్నాయి. పెద్దలక్ష్మీపురం బాలుర పాఠశాల్లో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 212 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి సౌకర్యానికి భవనాలున్నా నీటి సమస్య వెంటాడుతోంది. 18 మరుగుదొడ్లు, 18 బాత్ రూంలు ఏర్పాటు చేసినా నీటి వసతి సౌకర్యం లేక ఏడాదిగా నిరుపయోగంగా మారాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మలమూత్ర విసర్జనకు పరుగుపెడుతున్నారు. స్నానాల కోసం గ్రామం వద్ద ఉన్న చెరువులకు ఆశ్రయించ వలసి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఎప్పుడు ఏప్రమాదం ముంచు కొస్తుందోనని పాఠశాల ఉపాధ్యాయులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చవుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు.
నేలబొంతులో...
నేలబొంతు బాలికల ఆశ్రమపాఠశాల్లో 3 నుంచి పదో తరగతి వరకు 290 మంది విద్యార్థులుండగా వీరికి ఏడుగుురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. పాఠశాలలో ఏఎన్ఎం వైద్య సేవలు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రహరీ హుద్హుద్ తుపాను సమయంలో కొంత కొంత భాగం పడిపోయింది. ఉన్న గోడ కూడా ఎత్తు తక్కువ కావడంతో ఇబ్బం దులు తప్పడంలేదు. ఇక మధ్యాహ్న భోజనాలకు గ్యాస్ సౌకర్యం లేక కట్టెలతోనే వంటకాలు చేయవలసి వస్తోంది.
పెద్దమడిలో...
పెద్దమడి బాలికల ఆశ్రమ పాఠశాల్లో 3 నుంచి 10వరతగతి వరకు 411మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు ఏఎన్ఎం లేదు. దీంతో వ్యాధుల బారిన పడిన విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందు పడుతున్నారు. మరో వైపు దోమల బెడద పీడిస్తోంది. విద్యార్థుల సమస్యలపై ఐటీడీఏ పీఓ దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తలి దండ్రులు, గిరిజన సంఘ ప్రతినిధులు కోరుతున్నారు.