‘బిల్లు’ ఆమోదం బాధ్యత బీజేపీదే | the approval of 'telengana bill' is responsible of BJP | Sakshi
Sakshi News home page

‘బిల్లు’ ఆమోదం బాధ్యత బీజేపీదే

Feb 9 2014 4:20 AM | Updated on Sep 17 2018 8:21 PM

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బిల్లును ఆమోదించే బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీపైనే ఉందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 నిజాంసాగర్, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు  యూపీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బిల్లును ఆమోదించే బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీపైనే ఉందని  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సమన్యాయం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తెరవెనుక నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. శనివారం పోచారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేతో కలిసి మండల కేంద్రంలో విలేకరులతో  మా ట్లాడారు.

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి దశ కు చేరిందని, అరవై ఏళ్ల  కల త్వరలో సాకారం కానుందన్నారు.  తెలంగాణ  కోసం ఢిల్లీలోని జాతీయ నాయకులను కలిశామని, బిల్లు ఆమోదానికి జాతీయపార్టీల నాయకులు సానుకూలంగా మద్దతు ఇస్తున్నారన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎ మ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎంతమంది అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు.

 రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న చంద్రబాబునాయకుడు తెలంగాణను అడ్డుకోవడానికి బీజేపీ జాతీయ నేతలను కలుస్తుండడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎన్నిదీక్షలు చేసినా ప్రత్యేక రాష్ట్రం ఆగదన్నారు. సమావేశంలో స్థానిక టీఆర్ ఎస్ నాయకులు  రాజు, గంగారెడ్డి, వినయ్‌కుమార్, విఠల్, రాజే శ్వర్‌గౌడ్, రాజు, సత్యనారాయణ, దుర్గారెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement