శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌

Telangana CM KCR arrives at Tirumala for worship - Sakshi

కుటుంబ సమేతంగా వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఘనస్వాగతం 

ఘనంగా అతిథి మర్యాదలు చేసిన టీటీడీ

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సీఎం కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో కేసీఆర్‌కు వేదిపండుతులు ఆశీర్వచనం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో, తిరుమలలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆదివారం సాయంత్రం 4.10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం, తిరుపతి సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్, అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్, నగర పాలక కమిషనర్‌ విజయ్‌రామరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్న వారికి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ ఘనస్వాగతం పలికారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి పాదాలు సందర్శించిన కేసీఆర్‌ కుటుంబ సభ్యులు
కేసీఆర్‌ సతీమణి శోభారాణి, కోడలు శైలిమారావు, మనవడు హిమాన్షు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం శ్రీవారి పాదాలను, శిలాతోరణంను సందర్శించారు.

ఘనంగా ఆతిథ్యం
తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్‌ తిరుమలకు రెండవసారి వచ్చారు. ఆయనకు టీటీడీ ఘనంగా ఆతిథ్య మర్యాదలు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సీఎం కేసీఆర్‌కు శ్రీకృష్ణ అతిథి గృహాన్ని కేటాయించారు. ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎం.కె. సింఘ్, సీఐఎస్‌ఎఫ్‌ అడిషనల్‌ కమాండెంట్‌ శుక్లా, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top