
జిల్లా టీడీపీలో గంటారావం!
జిల్లా తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజే పెద్ద దిక్కు. ఆయన చెప్పిన వారికే జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవులు అప్పగించేవారు.
♦ గంటా నిర్ణయం మేరకే అధ్యక్ష ఎన్నిక
♦ జిల్లా పార్టీలో చేపట్టిన ఐవీఆర్ఎస్తో తేటతెల్లం
♦ కేంద్రమంత్రి అశోక్ ప్రతిపాదనకు నో...
♦ అభిప్రాయ సేకరణలో కానరాని జగదీష్పేరు
♦ జిల్లా కార్యదర్శిగా ఐవీపీ పేరొక్కటే
జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా... దిశానిర్దేశనం చేసే వ్యక్తిగా... ఇంత వరకూ పేరున్న అశోక్ గజపతిరాజును అధిష్టానం పక్కన పెడుతున్నట్టు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గడచిన రెండు సమావేశాల్లో చెప్పినట్టు అభిప్రాయ సేకరణ ప్రారంభించిన అధిష్టానం... అశోక్ సూచించిన ద్వారపురెడ్డి జగదీష్ పేరును చేర్చకపోవడం జిల్లా క్యాడర్ను ప్రశ్నార్థకంలో పడేసింది. ఇక పార్టీలో ఏం జరగబోతోందన్న వ్యాఖ్యానాలు, చర్చలు టీడీపీ క్యాడర్లో జోరందుకున్నాయి.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లా తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజే పెద్ద దిక్కు. ఆయన చెప్పిన వారికే జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవులు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆ సంప్రదాయానికి అధిష్టానం చెక్ చెప్పినట్టు కనిపిస్తోంది. అశోక్ సూచించిన ద్వారపురెడ్డి జగదీష్ను ఈసారి తప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్లమెంటు ఇన్చార్జిగా జిల్లాలో అడుగుపెట్టిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం మాయ చేశారో కానీ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఆయనే జిల్లాకు వచ్చారు. అప్పటినుంచి అశోక్పై పై చేయి సాధించేలా కనిపిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకే అధ్యక్ష ఎంపిక సాగుతోందన్నది స్పష్టమవుతోంది.
అభిప్రాయ సేకరణ ముగ్గురిపైనే...
టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికోసం అధిష్టానం నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో జిల్లాలోని ముగ్గురి పేర్లే వినపిస్తున్నాయి. గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ఆయన సోదరుడు కొండబాబు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడి పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. వీరిలో ఎవరైతే అధ్యక్ష పదవికి బాగుంటుందన్న దానిపై ఐవీఆర్ఎస్లో క్యాడర్ నుంచి సమాధానాలు కోరుతున్నారు. అంటే ఈ ముగ్గురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికే గజపతినగరంలో అన్నదమ్ముల పోరు సాగుతోం ది.
ఎమ్మెల్యే కె.ఎ.నాయుడిపై ఆయన సోదరుడు కొండబాబు అధినేత చం ద్రబాబుకు ఫిర్యాదు చేయడం ఆ తరువాత స్వయంగా వెళ్లి కలవడమూ తెల్సిందే! ఆ సందర్భంలోనే తనకు టీడీపీ పదవిని ఇవ్వాలని కోరినపుడు అభిప్రాయ సేకరణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడీ ఐవీఆర్ఎస్ లో ఆయనపేరు ఉంది. అలాగే కె.ఎ.నాయుడు సైతం చంద్రబాబును కలసి వచ్చిన తరువాత ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినట్టుంది. పలుమార్లు పూసపాటిరేగ ఎంపీపీగా టీడీపీకి బలమయిన ద్వితీయ శ్రేణి నాయకుడిగా మహంతి ఉన్నారు. అందుకే ఆయన పేరు కూడా చేరింది.
అశోక్ ప్రాబల్యానికి చెక్
అధ్యక్షుడి ఎంపిక విషయంలోనే గాకుండా ఇటీవల శత్రుచర్ల విజయరామరాజు, సుజయకృష్ణారంగారావు చేరిక విషయంలో.... సుజయ్కు మంత్రి పదవి ఇవ్వడంలోనూ అధిష్టానం తీరు చూస్తుంటే ఇక అశోక్ ప్రాబల్యానికి బ్రేక్ వేసినట్టయింది. ఇన్చార్జి మంత్రి గంటా జిల్లాకు వచ్చిన తరువాత అది మరింత ఎక్కువైందనడంలో సందేహం లేదు. అశోక్ చెప్పిన వ్యక్తికే అధ్యక్షస్థానం ఖరారు చేస్తూ ఎప్పుడూ మహానాడుకు ముందే ఈ ఎన్నిక జరిగిపోయేది. కొత్త కార్యవర్గంతో ఆ వేడుకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అశోక్ మాటకు విలువే లేకుండా పోయింది.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ!
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో డైలమాలో పడిన టీడీపీ క్యాడర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో ఏ మాత్రం సందిగ్ధత ప్రదర్శించలేదు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.వి.పి. రాజునే దాదాపు ఖరారు చేసినట్టు భోగట్టా. కాగా జగదీష్తోపాటు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభ హైమావతి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తూముల భాస్కరరావు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత తదితరుల పేర్లు కూడా పరిశీలనలో లేకపోవడం విశేషం. మరి ఈసారి ఎవరికి పదవి వరిస్తుందో చూడాలి మరి.