పచ్చ తమ్ముళ్ల అక్రమాలు..

Tdp Leaders Doing Fraud In Contracts - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లలో జిల్లాలోని ‘పచ్చ’తమ్ముళ్లు గత ఐదేళ్లలో రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పనులకు వాడవాడలా ‘చంద్రన్న బాట’ పేరుతో ‘షో’ చేస్తూ ఈ అవినీతికి తెరదీశారు. అధికార పార్టీ నేతలు నామినేటెడ్‌ పద్ధతిలో పనులు దక్కించుకొని, నాసిరకంగా పనులు చేపట్టి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దీంతో ఈ రోడ్లలో నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 

జన్మభూమి కమిటీ అండదండలతో..
సీసీ రోడ్లు ‘పచ్చ’నేతలకు కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల ముసుగులో వారు చెలరేగిపోయారు. సీసీ రోడ్ల పనులన్నీ నామినేటెడ్‌ పద్ధతిలో టీడీపీ నేతలకే కట్టబెట్టడంతో ఇష్టారీతిన దోచుకుతిన్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీసీ రోడ్ల నాసిరకం పనులపై లోకాయుక్తకు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి, కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందిస్తూ విచారణ జరిపాక నిధులు రికవరీ కూడా చేశారు. తమ పంటపొలాలకు, లే అవుట్లకు, ప్రభుత్వ నిధులతో సీసీరోడ్లను వేసి  ఆ పరిసర ప్రాంత భూములకు ధరలు పెంచడానికే ఈ నాలుగేళ్లు కృషి చేశారన్న విమర్శలున్నాయి.  

బెర్ములు వేయకుండానే రూ.40 కోట్లు స్వాహా..
చంద్రన్న బాటలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేసిన సీసీ రోడ్లకు బెర్ములు వేయడం లేదు. వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని నామినేటెడ్‌ పద్ధతిలో పనులు చేపడుతున్న టీడీపీ నేతలు మింగేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్ల పక్కన నిర్మించాల్సిన బెర్ముల విషయంలో అక్రమాలు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్ములను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎత్తు రోడ్డు నుంచి వాహనం సురక్షితంగా కిందకు దిగుతుంది. ఈ బెర్ములు పటిష్టంగా ఉండాలని విధిగా కంకరతో కూడిన గ్రావెల్‌తో రోడ్డుకు ఇరుపక్కలా నిర్మిస్తారు. కిలోమీటర్‌ మేర సీసీ రోడ్డుకు రెండుపక్కలా గ్రావెల్‌తో బెర్ములు వేయడానికయ్యే ఖర్చు అంచనా వ్యయంతో కలిపి ఉంటుంది. సరాసరి రహదారి అంచనా వ్యయంలో 10 శాతం బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. బెర్ములు వేసిన తర్వాతే ఆ రోడ్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలి. కానీ, సీసీ రోడ్లు వేసిన తర్వాత బెర్ములు నిర్మించకుండా వదిలేస్తున్నారు. మరికొన్నిచోట్ల  బురద కాలువల్లో పూడిక తీసిన మట్టి, భవనాలు తొలగించిన మట్టి వేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ శాతం బెర్ములు వేయకుండానే అడ్డగోలుగా బిల్లులు డ్రా చేసేస్తున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు గ్రామాల్లో కేవలం సిమెంటు రహదారులు నిర్మించి ఊరుకుంటున్నారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకం నిధుల్ని తన పేరు పెట్టుకుని చంద్రబాబు ఖర్చు పెట్టారు. జిల్లాలో రూ.400 కోట్లతో 1,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. ఈలెక్కన రూ.40 కోట్లతో బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. కానీ, జిల్లాలో వేసిన సీసీ రోడ్లలో 20 శాతానికి మాత్రమే బెర్ములు వేసినట్టు తెలుస్తోంది. మిగతా వాటికి  వేయకపోవడంతో వాటికోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి.

బెర్ములు లేకపోవడంతో ప్రమాదాలు
రహదారి నిర్మాణంతో పాటు వాటికిరువైపులా కంకర వేసి, షోలర్లు నిర్మించాలి. సిమెంట్‌ రోడ్లు ఎత్తుగా ఉండటంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు వెళ్లాలంటే రోడ్డు దిగాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా వాహనం సురక్షితంగా దిగడానికి వీలుగా ఇరువైపులా షోల్డర్‌ ఉండాలి. కానీ చంద్రన్నబాట కింద నిర్మిస్తున్న సిమెంటు రోడ్లకు మాత్రం ఇవేవీ ఉండటం లేదు. బెర్ములు లేని రహదారులు పలు గ్రామాల్లో ప్రమాదకరంగా తయారయ్యాయి. వాహనదారులు ఆయా రోడ్లలో రోజూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు ప్రయాణించే సమయంలో ఒకసారి సిమెంటు రోడ్డు దిగితే మళ్లీ ఎక్కించడం కష్టంగా మారుతోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగేందుకు సహితం వీలుపడటం లేదు. ఒక్కోసారి ‘నువ్వు వెనక్కి వెళ్లంటే.. నువ్వు వెనక్కి వెళ్లంటూ’ గొడవలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రిళ్లు ద్విచక్ర వాహనదారులు, ఆటోల వంటివి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలున్నాయి.

జిల్లాలో జరిగిన ప్రమాదాలు ఇలా... 
వడ్లమూరు వెళ్లే సీసీ రహదారికి బెర్మ్‌ లేకపోవడంతో ద్విచక్ర వాహనంతో కిందికి దిగి పైకి ఎక్కుతుండగా లారీ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పెద్దాపురం మండలం ఆర్‌బీ పట్నం రోడ్డులో ఎదురుగా ట్రాక్టర్‌ రావడంతో భార్య, పిల్లలతో కలిసి మోటార్‌ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. బెర్మ్‌ లేకపోవడంతో కిందికి దిగలేకపోతున్న సమయంలో నేరుగా ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top