నేత... మేత

TDP development work to 2019 Election time - Sakshi

పైసా వసూల్‌ 

ఎన్నికల వేళ ఎడాపెడా అభివృద్ధి పనుల మంజూరు 

అంచనాలు పెంచి భారీ మొత్తానికి టెండర్లు 

ఏజెన్సీల నుంచి నేతలకు ‘గుడ్‌విల్‌’  

ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే భారీగా వసూళ్లు 

జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు 

పార్థకు కియా పంట 
కియాకు ఇచ్చిన రూ.600 ఎకరాలు చదును చేసేందుకు రూ. 178 కోట్లతో టెండర్‌ పిలిచారు. ఈ పనుల్లోనే స్థానిక ఎమ్మెల్యే బీకేకు రూ.30 కోట్లు అందినట్లు తెలుస్తోంది.  

‘పేరూరు’లో సునీతకు వాటా  
పేరూరు ప్రాజెక్టుకు రూ.803 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో మంత్రి సునీతకు రూ.84 కోట్లు ఏజెన్సీ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.  

కాలవకు భారీ లబ్ధి 
బీటీపీకి నీరిచ్చే పనులను తొలివిడతలో రూ.344కోట్ల సివిల్‌ వర్క్స్‌ ప్రారంభించారు. ఈ పనుల్లో మంత్రికి రూ. 84 కోట్లు గుడ్‌విల్‌ ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

పయ్యావులకు ప్యాకేజీ 
హంద్రీ–నీవాలో భాగంగా 36వ ప్యాకేజీ     డిస్ట్రిబ్యూటరీకి రూ.336కోట్లు మంజూరైంది. ఇందులో 15 శాతం చొప్పున రూ.36 కోట్లు పయ్యావుల కేశవ్‌కు అందనుంది.  

బాలకృష్ణకూ మామూళ్లు 
చిలమత్తూరు–మడకశిర రోడ్డు పనులను రూ.282 కోట్లకు ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. ఇందులో రూ.45 కోట్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ‘గుడ్‌విల్‌’ అందనుంది. 

ఎన్నికల వేళ ‘అనంత’ నేతలు అభివృద్ధి మంత్రం జరిపిస్తున్నారు. అడ్డగోలుగా అభివృద్ధి పనుల అంచనా వ్యయం పెంచేసి ఏజెన్సీల నుంచి ‘గుడ్‌విల్‌’ దండుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలని సిద్ధమైపోయారు. ప్రభుత్వం కూడా నీళ్లు, రోడ్లు, రైతుల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చును ముందుగానే దోచిపెడుతోంది.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచింది. ఇన్నేళ్లలో ఎకరాకు కూడా ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఆర్నెళ్ల ముందు రైతులు, నీళ్ల పేరుతో వేల కోట్లాది రూపాయలు ‘అనంత’లో గుమ్మరిస్తున్నారు. ‘అనంత’పై తనకు ఎనలేని ప్రేమ ఉందని జిల్లాకు వచ్చిన ప్రతీసారి సీఎం చంద్రబాబు వల్లెవేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరు వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాజెక్టును మంజూరు చేసి, ప్రాజెక్టు ఖర్చును భారీగా పెంచి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు దోచిపెడుతున్నారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.  

ఆ రెండు రోడ్ల పనులు సూరీకే 
బత్తపల్లి–రాప్తాడు నేషనల్‌ హైవే పనులను రూ.147 కోట్లకు కేసీపీఎల్‌–లికాన్‌(జాయింట్‌ వెంచర్‌) దక్కించుకుంది. కళ్యాణదుర్గం–రాయదుర్గం పనులను రూ.194 కోట్లతో ఇవే సంస్థలు దక్కించుకున్నాయి. అంటే రూ.341 కోట్ల విలువైన ఈ రెండు పనులను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ సబ్‌లీజుకు చేస్తోంది. ఇందులో ఏస్థాయిలో మిగులుతుందో ఇట్టే తెలుస్తోంది. చిలమత్తూరు–మడకశిర రోడ్డు పనులను రూ.282 కోట్లకు ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. ఇందులో రూ. 45 కోట్లు ఎమ్మెల్యే బాలకృష్ణకు ‘గుడ్‌విల్‌’ అందనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పనుల్లో కూడా బాలయ్యతో పాటు మడకశిర ఎమ్మెల్యే ఈరన్నకు మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. 

ఎంపీ జేసీకి భారీగా గుడ్‌విల్‌ 
గుంతకల్లు–గుత్తి హైవే పనులు రూ.275 కోట్లకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కాయి. ఈ పనులు మొదట 13 శాతం లెస్‌కు రిత్విక్‌ దక్కించుకుంది. ఆ తర్వాత టెండర్‌ రద్దు చేసి, తిరిగి 4.95 శాతానికి పెంచి మళ్లీ టెండర్‌ దక్కిచుంది. లెస్‌ చేసిన 13 శాతం, పెంచిన 4.95 శాతం ప్రభుత్వానికి నష్టమే. ఈ డబ్బులు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రిత్విక్‌ ఇవ్వాలని ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంటే రూ.50 కోట్ల మేర అందనుంది. హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా యాడికి కెనాల్‌ పనులు 548.96 కోట్లుతో సాగుతున్నాయి. ఈ పనులు జీఎస్‌రెడ్డి, కేకేరెడ్డి, హిందుస్తాన్‌ రత్నకి చెందిన ఏజెన్సీలు చేస్తున్నాయి. ఇందులో కూడా జేసీ బ్రదర్స్‌కు భారీగానే ‘గుడ్‌విల్‌’ అందినట్లు తెలుస్తోంది. జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌) పనులు రిత్విక్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తున్నాయి. ఈ పనుల్లో పయ్యావుల కేశవ్, గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు లబ్ధి చేకూరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న మారాల రిజర్వాయర్, కదిరి పరిధిలోని చెర్లో పల్లి రిజర్వాయర్‌ పనులతో పల్లె రఘునాథరెడ్డి, అత్తార్‌ చాంద్‌బాషా, కందికుంట ప్రసాద్‌కు డబ్బులు చేరినట్లు తెలుస్తోంది.  

పార్థకు కియా పంట 
కియా రాకతో పెనుకొండ ఎమ్మెలే పార్థసారథికి భారీగా లబ్ధి చేకూరింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈయనకు కియాకు ఇచ్చిన రూ.600 ఎకరాలు చదును చేసేందుకు రూ. 178 కోట్లతో టెండర్‌ పిలిచారు. ఈ పనుల్లోనే బీకేకు రూ.30 కోట్లు అందినట్లు తెలుస్తోంది. అనంతలో రూ.191 కోట్లతో పైపులైన్‌ పనులు మంజూరయ్యాయి. ఇందులో ఫేజ్‌–1లో రూ.147 కోట్ల పనులను 6.89 శాతం ఎక్కువతో ఐహెచ్‌పీ దక్కించుకుంది. ఇందులో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి భారీగా అందినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా కార్పొరేషన్‌ పరిధిలో జరిగే ప్రతీ పనిలో ఎమ్మెల్యేకి మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శింగనమలలో విప్‌ యామినీ బాల ఇసుక ద్వారా భారీగా అర్జించింది. ఇసుకకు శింగనమల అడ్డా కావడంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. ఇలా 14 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడిక్కడ ప్రజాధనాన్ని కొల్లగొట్టి నగదు రూపంలో పోగు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ స్థాయిలో అర్జించిన వీరంతా ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ. 25 కోట్ల నుంచి రూ.40 కోట్లు వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధ మయ్యారు.   

పేరూరు ప్రాజెక్టు కథ ఇదీ 
పేరూరు ప్రాజెక్టుకు రూ.95కోట్లతో బోరంపల్లి నుంచి నీళ్లిచ్చేందుకు 2009లో డీపీఆర్‌ సిద్ధమైంది. రూ.56 కిలోమీటర్ల మేర ఈ కాలవ తవ్వాలి. దాదాపు పదేళ్లు కావస్తోంది కాబట్టి ఏడాదికి పదిశాతం చొప్పున పెంచినా రూ.190 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయవ చ్చు. కానీ ప్రభుత్వం రూ.803 కోట్లు మంజూరు చేసింది. తొలివిడతగా రూ.565 కోట్ల పనులను ‘మెగా’ నిర్మాణసంస్థకు కట్టబెట్టింది. ఈ పనుల్లో మంత్రి సునీతకు 15 శాతం చొప్పున రూ.84 కోట్లు ఏజెన్సీ ఇచ్చేలా ఒప్పందం చేసినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అమరావతిలో చినబాబుగా పిలవబడే ఓ మంత్రికి భారీగానే కప్పం కట్టాలని తెలుస్తోంది. ఇది కాకుండా నాలుగేళ్లలో ఇప్పటికే భారీగా అర్జించిన పరిటాల కుటుంబం ఈ నిధులతో ఎన్నికల్లో ఏ స్థాయిలో ఖర్చు పెట్టనుందో ఊహించవచ్చు.  

పయ్యావులకు 36వ ప్యాకేజీ 
హంద్రీ–నీవాలో భాగంగా 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీకి రూ.336 కోట్లు మంజూరైంది. ఇందులో తొలివిడతగా 244.72 కోట్ల పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచారు. ఇందులో 15 శాతం చొప్పున రూ.36 కోట్లు శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌కు అందినుంది. ఈ పనుల్లో తక్కిన 91.64 కోట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగనున్నాయి. ఇందులో కూడా 15 శాతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు ‘గుడ్‌విల్‌’ అందనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top