దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు | Sullurpeta MLA Kiliveti Sanjeevaiah fire AP CM babu | Sakshi
Sakshi News home page

దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు

May 9 2018 10:53 AM | Updated on May 29 2018 4:40 PM

నాయుడుపేటటౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మొదటినుంచి దళితులంటే చిన్నచూపని వైఎస్సార్‌ సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఆ పార్టీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి నివాసంలో మంగళవారం ఎమ్మెల్యే విలేకరులతో సమావేశంలో మాట్లాడా రు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా అమరావతిలో ఆయన 125 అడుగల విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చలేకపోయారన్నారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మేరిగ నాగార్జున శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తుంటే పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. 

చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలకు తెలియజేసేలా శాంతి యుతంగా ప్రదర్శన చేస్తున్న వారిని అడ్డుకోవడం నీతిమాలిన చర్య అన్నారు. రాష్ట్రంలో దళితుల మధ్య చిచ్చుపెట్టిన ఘనత బాబుకే దక్కిందన్నారు. ఆడబిడ్డకు రక్షగా నిలుద్దామని చెప్పే అర్హత బాబుకు ఉందా అని ప్రశ్నించారు. తహసీల్దార్‌ వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే పట్టించుకోని మీరు అధికారుల చేత ర్యాలీలు చేయించడం శోచనీయమన్నారు. మేరిగ నాగార్జున అక్రమం అరెస్ట్‌ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దళితుల సత్తా చూపుతామన్నారు. సమావేశంలో నాయకులు తంబిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ముప్పాళ్ల జనార్దన్‌రెడ్డి, గంధవల్లి సిద్ధయ్య, ఆబోతుల బాబు, లింగారెడ్డి సురేష్‌రెడ్డి, పేట చంద్రారెడ్డి, కటకటం జయారామయ్య, ప్రకాశం పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement