షాక్‌ కొడుతుంది జాగ్రత్త.. 

Story On Precautions To Be Taken To Avoid Electrical Accidents - Sakshi

వర్షాకాలంలో విద్యుత్‌తో జరభద్రం

ఫిర్యాదుకు ప్రత్యేక నంబర్‌ 1912  

సీతంపేట: రెండు రోజుల కిందట లోవగూడ గ్రామానికి చెందిన సవర చిన్నారావు తెగిపడిన విద్యుత్‌ వైరును చూడకుండా ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి మృతి చెందాడు. అలాగే ముత్యాలుకు చెందిన సవర జమ్మడు అనే గిరిజనుడు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో పడి ఉన్న విద్యుత్‌ తీగ లపై చూసుకోకుండా కాలు వేయడంతో షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇటీవల దేవనాపురానికి చెందిన కుండంగి మే డపైకి ఎక్కుతుండగా వాలి ఉన్న విద్యుత్‌ వైరు పొరపాటున పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. ఇలా ఇదే మండలంలో కాకుండా జిల్లాలోని విద్యుత్‌ ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడానికి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభమైందంటే విద్యుత్‌ ప్రమాదాలు మొదలైనట్టే. ఎందుకంటే వర్షాలకు, గాలులకు చెట్లు కొమ్మలు విరగడం, విద్యుత్‌ తీగలు తెగిపడడం జరుగుతుంటాయి. ఈ సమయంలో వీటిని గమనించకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మ రోవైపు గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఇళ్ల మధ్యనే ఉండడం, వాటికి సరైన రక్షణ ఏర్పాటు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ల మధ్య తుప్పలు ఉండడం, విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు పడడం, పొలాల్లో వేసిన విద్యుత్‌ తీగలు చేతికందేలా ఉండడం, ఇంటికి సమీపం నుంచే విద్యుత్‌ తీగలు వెళ్లడం, స్తంభాలు విరిగిపోవడం, ఒరిగిపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడుడు లోటు పాట్లు సరిచేయాల్సిన అవసరం ఉంది. 

ప్రమాదాల నివారణ ఇలా..  
విద్యుత్‌ స్తంభాలను తాకకూడదు. 
స్తంభాలకు తాకుతూ వెళ్లే టెలిఫోన్, టెలివిజన్‌ కేబుళ్లు తాకరాదు.  
నీటిలో పడిన విద్యుత్‌ వైర్ల జోలికి వెళ్లకూడదు.  
సబ్‌స్టేషన్‌ చుట్టూ ఉన్న రక్షణ తీగను పట్టుకోకూడదు.  
భవన నిర్మాణం పనుల్లో విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండాలి.  
తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్‌ పరికరాలు ముట్టుకోకూడదు. మరమ్మతులు చేయరాదు.  

వీటిని చేయవద్దు.. 
ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చెత్తవేయడం. 
సబ్‌స్టేషన్‌ వారి అనుమతులు లేకుండా విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం. 
సొంతంగా ఇంటికి వైరింగ్‌ చేయడం. 
స్తంభం ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర     మూత్ర విసర్జన చేయడం 
విద్యుత్‌ స్తంభాలకు పశువులను కట్టడం.  

ఇంట్లో ఈ జాగ్రత్తలు..  
ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌ వద్దకు పిల్లలు వెళ్లకుండా చూడాలి.  
వేడి నీరు ఉన్న ప్రదేశాల్లో విద్యుత్‌ పరికరాలు ఉంచకూడదు. 
చేతులు తడిగా ఉన్నప్పుడు స్విచ్‌ లు తాకకూడదు. 
స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా ప్లగ్‌లను తీయకూడదు. 
పిల్లలకు అందేంత ఎత్తులో ప్లగ్గులు ఉంచకూడదు.  

అప్రమత్తంగా ఉండాలి 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్‌ వైర్లు తెగిపడినా, వాలినా లోకల్‌గా ఎలాంటి రిపేర్లు చేయరాదు. మాకు సమాచారం ఇవ్వాలి లేదంటే 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. వెంటనే సమస్య పరిష్కారమవుతుంది. వ్యవసాయ బోర్లకు ఏవైనా పాత సరీ్వస్‌ వైర్లు ఉంటే వాటిని మార్చుకోవాలి. స్విచ్‌లు వంటివి చూసుకోవాలి. పాతకాలానికి ఎలాంటి వైర్లు ఉన్నా తీసివేయాలి.  
– బి.సాంబశివరావు, ఈఈ, ట్రాన్స్‌కో   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top