పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రైతులు, సీపీఎం నాయకులు, ఐద్వా నాయకులు అడ్డుకున్నారు. బుదవారం పురుషోత్తపట్నం రెవెన్యూలో సంతకం చేయని కొండు నానిబాబు
సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రైతులు, సీపీఎం నాయకులు, ఐద్వా నాయకులు అడ్డుకున్నారు. బుదవారం పురుషోత్తపట్నం రెవెన్యూలో సంతకం చేయని కొండు నానిబాబు పంటభూమిలో దౌర్జన్యంగా పైల్పైన్ పనులు ప్రారంభించారు. దీంతో రైతులు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎంపీ మిరియం బాబూరావు, రాజమహేంద్రవరం డివిజన్ కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, ఐద్వా జిల్లా కార్యదర్శి పీ తులసి పంటపొలం వద్దకు చేసుకున్నారు.
పనులు అడ్డగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు హెచ్చరించినా రైతులు, నాయకులు పనుల వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారు. దీనితో పోలీసులు వారిని సీతానగరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. నాయకులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్న రైతుల అరెస్ట్ అన్యాయమన్నారు. సీపీఎం ఐద్వా నాయకులతోపాటుగా రైతులు నందిపాటి ఉదయ్భాస్కర్, మట్టా వెంకటేశ్వరరావు, కొండి నానిబాబు, పెనుగూరి వెంకటరామారావులను సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచారు.