
ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఏడుగురు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాగలమర్రి మండలం పెద్ద బోధనం సమీపంలో వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది
చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతికి వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతి తాలూకా వాసులు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.... మార్గం మధ్యలో ఒకరు, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఒకరు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించడంతోపాటు వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు.