
సర్కారు దిగిరావాల్సిందే..
సర్కార్ దిగివచ్చే వరకు పోరు సాగిస్తామని ఔట్సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు...
- పారిశుధ్య కార్మికుల డిమాండ్
- కమిషనర్ బంగళా ముట్టడికి యత్నం
- అరెస్ట్ చేసిన పోలీసులు
విజయవాడ సెంట్రల్ : సర్కార్ దిగివచ్చే వరకు పోరు సాగిస్తామని ఔట్సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాఘవయ్య పార్క్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద సిద్ధంగా ఉన్న పోలీసులు యూనియన్ నాయకుల్ని, కార్మికులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది.
అప్పటికే సిద్ధంగా ఉంచిన వాహనాల్లో కార్మికుల్ని నెట్టి అరెస్ట్ చేశారు. వన్టౌన్, భవానీపురం పోలీస్ స్టేషన్లకు తరలించారు.యూనియన్ నాయకుడు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కార్మికుల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అరెస్ట్లతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ కార్మిక వ్యతిరేకిలా మాట్లాడటం సబబుకాదన్నారు. సమస్య పరిష్కారానికి టీడీపీ ప్రజాప్రతినిధులు కృషి చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో మునిసిపల్ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు, ముజ్ఫర్, ఎం.డేవిడ్, జె.జేమ్స్ పాల్గొన్నారు.