
పార్టీని నడిపే బాధ్యత మీదే
పార్టీని ముందుకు నడిపే బాధ్యత మీదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కార్యకర్తలతో అన్నారు. రాజమండ్రి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, రాజమండ్రి :పార్టీని ముందుకు నడిపే బాధ్యత మీదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కార్యకర్తలతో అన్నారు. రాజమండ్రి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం స్థానిక మంగళవారపుపేటలోని గంటా గనిరాజు కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల మాట్లాడుతూ ‘మీకు ఏ కష్టం వచ్చినా జ్యోతుల ఉన్నాడని గుర్తు చేసుకోండి’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్షోపన్యాసంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీకి దిశా నిర్దేశం చేస్తామన్నారు.
జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు, గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన బొడ్డు వెంకట రమణచౌదరి, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశారన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గిరజాల వెంకట స్వామినాయుడు, వివిధ జిల్లా సెల్ల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, కొండేటి చిట్టిబాబు, గారపాటి ఆనంద్, రాజమండ్రి రూరల్ కన్వీనర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యుడు మాసా రాం జోగ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, ఆదిరెడ్డి వాసు, రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజ బాబు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు నెహ్రూకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నెహ్రూ, చిట్టబ్బాయిలను ఘనంగా సత్కరించారు.