రూ.20.22 లక్షల ఎర్రచందనం పట్టివేత | Rs .20.22 lakh redwood seized | Sakshi
Sakshi News home page

రూ.20.22 లక్షల ఎర్రచందనం పట్టివేత

May 31 2015 5:46 AM | Updated on Sep 26 2018 6:01 PM

మండలంలోని భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణం వైపున అక్రమంగా తరలిస్తున్న రూ.20.22 లక్షల విలువైన...

సిద్దవటం : మండలంలోని భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణం వైపున అక్రమంగా తరలిస్తున్న రూ.20.22 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ ఉలసయ్య తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం రావడంతో సిద్దవటం ఎస్‌ఐ లింగప్ప, సిబ్బంది, తిరుపతికి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్, భాకరాపేట చెక్‌పోస్టు అటవీ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణ వైపు నుంచి తుర్రా వెంకటసుబ్బయ్య ఏపీ04 డబ్ల్యూ 8528 నంబరు గల ట్రాక్టర్‌లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా తుర్రా ప్రతాప్, తుర్రా ప్రభాకర్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ట్రాక్టర్‌కు ముందు వైపున పెలైట్‌గా వెళుతున్నారు. పోలీసులను చూసిన వెంటనే తుర్రా ప్రతాప్, ప్రభాకర్ ద్విచక్ర వాహనాన్ని పడేసి పరారు కాగా, ట్రాక్టర్‌ను నడుపుతున్న తుర్రా వెంకట సుబ్బయ్య, సుబ్బరాజు పరారయ్యారు.

ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న కూలీల మేస్త్రీ కొత్త మాధవరానికి చెందిన అలిశెట్టి వెంకట సుబ్బయ్య, అట్లూరు మండలం మాడపూరు గ్రామానికి చెందిన గాలిశెట్టి యల్లయ్య, మాధవరం-1కు చెందిన బొడిచెర్ల సుబ్రమణ్యం, నేకనాపురం పల్లె గోపయ్య, మాధవరం-1 అంబేద్కర్ నగర్ తిప్పన హరిబాబు, అలీనగర్ డేరింగుల వెంకటేశ్వరరావులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో కూలీ, మాధవరం-1కు చెందిన భాషాను శనివారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

పట్టుబడిన 36 ఎర్రచందనం దుంగలు ఒక టన్ను 200 కిలోల బరువు ఉంటాయని, వీటి విలువ రూ. 20.22 లక్షలు కాగా, రూ. 4 లక్షలు విలువజేసే ట్రాక్టర్‌ను, రూ. 80 వేలు విలువజేసే పల్సర్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని సీఐ తెలిరు. తుర్రా వెంకట సుబ్బయ్య, ప్రతాప్, ప్రభాకర్, మిట్టపల్లెకు చెందిన చెంచయ్యనాయుడులను పట్టుకునేందుకు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని, వారికి సమాచారం ఇచ్చినా, ఎవరైనా సహకరించినా, వారితో తిరిగినా, వారిని ఆశ్రయించినా అటవీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వారికి ఎలాంటి సహకారం అందించవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లింగప్ప, ఏఎస్‌ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ కురబత్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement