
ఆదివారం అర్ధరాత్రి...రేవ్ రచ్చ
బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పరిధిలో గల గ్రీన్ వ్యాలీ వాటర్ పార్క్ రిసార్టులో ఆదివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడులు నిర్వహించారు
భువనగిరి/బీబీనగర్, న్యూస్లైన్
బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పరిధిలో గల గ్రీన్ వ్యాలీ వాటర్ పార్క్ రిసార్టులో ఆదివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడులు నిర్వహించారు. రిసార్ట్లో రేవ్ పార్టీని నడుపుతూ అశ్లీల నృత్యాలు చేస్తున్న 10మంది యువతులను, మద్యం సేవిస్తు వారితో చిందులేసిన డీలర్లను భువనగిరి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ జె.నరేందర్ ఆధ్వర్యంలో బీబీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఘవాపురం గ్రామ పరిధిలో గతంలో ఉన్న మాగ్జిమా రిసార్టును ప్రస్తుతం గ్రీన్ వ్యాలీ వాటర్ పార్క్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి. అందుకు అవసరమైన స్విమ్మింగ్ పూల్, గదులు ఇతర ఆహ్లాదకర వసతులను ఏర్పాటు చేశారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్లోని బీఎన్రెడ్డి నగర్ సమీపంలోని ఇంజపురం వద్ద గల ఓంకార్ బయోటెక్ ఎరువుల కంపెనీ యజమాని ఓబుల్రెడ్డి తన వ్యాపారాన్ని విస్తరించేందుకు జిల్లాలోని కొందరు డీలర్లకు ఈ రిసార్ట్లో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీకి మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, సూర్యాపేట, హాలియా, హుజుర్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ఎరువుల డీలర్లు 48 మంది వచ్చారు. ముంబయి, కలకత్తా, ఢిల్లీకి చెందిన 10మంది యువతులను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ పార్టీ రాత్రి 11గంటలకు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటాక పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మూకుమ్మడిగా రిసార్ట్పై దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను, మద్యం సేవిస్తున్న 48 మంది డీలర్లతోపాటు పార్టీకి యువతులు తీసుకువచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రిసార్టు నడుపుతున్న హైదరాబాద్కు చెందిన రామారావు, సురేష్, శేఖర్, జై హిన్లను కూడా అరె స్ట్ చేశారు. యువతులను తీసుకువచ్చిన బ్రోకర్లు దినేష్, అహ్మద్లు సంఘటనా స్థలం నుంచి తప్పించుకుపోయారు. పార్టీ జరుగుతున్న రిసార్ట్ గదుల్లో నిరోధ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
యువతులకు కౌన్సెలింగ్
యువతులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. తమకు అర్కెస్ట్రా ఉందని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చారని, తీరా వచ్చాక అశ్లీల నృత్యాలు చేయించారని యువతులు పోలీసులకు చెప్పారు. పొట్టకూటి కోసం వస్తే తమకు ఈ పరిస్థితి ఎదురైందని వాపోయారు. 10 మంది యువతులను పునరావాస కేంద్రానికి పంపించనున్నట్టు డీఎస్పీ చెప్పారు.
51మందిపై కేసు నమోదు
రాఘవాపురం గ్రామ పరిధిలో గల గ్రీన్ వ్యాలీ వాటర్ పార్క్ రిసార్ట్లో అసాంఘిక కార్యక్రమాలు, రేవ్ పార్టీ నడుపుతున్న 51 మందిపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం బీబీనగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడిలో 10 మంది యువతులను తీసుకువచ్చిన హైటెక్ బస్సుతో పాటు మరో 6 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులూ లేకుండా పార్టీలు నడుపుతుండడంతో రిసార్ట్ను సీజ్ చేయనున్నట్టు చెప్పారు. రిసార్ట్ యజమాని నరేంద్రనాథ్రెడ్డి, బయోటెక్ కంపెనీ యజమాని ఓబుల్రెడ్డిలతో పాటు బ్రోకర్లను అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. సబ్ డివిజన్లో ఎక్కడైనా రిసార్ట్లలో రేవ్ పార్టీలు ఎర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ నరేందర్, ఎస్ఐలు రఘువీర్రెడ్డి, శ్రీనివాస్లు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు
అడ్డాగా రిసార్ట్లు
భువనగిరి డివిజన్లో పలు రిసార్టులు అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పోలీ సులు దాడి చేసి పట్టుకున్న సందర్భాల్లో ఈ విషయం బయటకు వస్తున్నాయే తప్పా మిగతా సమయాల్లో రావడం లేదు. హైదరాబాద్ శివారులో గల బొమ్మలరామారం, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల్లో పలు రిసార్ట్స్ ఉన్నాయి. రాజధానిలో ధనిక వర్గాలు ఇక్కడికి వస్తుంటాయి. పది సంవత్సరాల క్రితం బొమ్మలరామం దగ్గర గల స్ప్రింగ్ ల్యాండ్ రిసార్టులో పెద్ద ఎత్తున జంటలను అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా పెద్దగా వెలుగులోకి రాలేదు. తాజాగా పట్టుబడిన మాగ్జీమా రిసార్టు (ఇప్పుడు గ్రీన్వ్యాలీ వాటర్ పార్కు)లో పేకాట ఆడుతూ గతంలో పట్టుబడ్డారు. ఈ రిసార్ట్లో మద్యం అమ్మకాలు, పార్టీలు జరుగుతున్నా బయటకు రాలేదు. ఇటీవల పేరు మార్చుకుని తాజాగా రేవ్ పార్టీని నిర్వహిస్తూ పోలీసుల దాడిలో బయటపడింది. అదే విధంగా యాదగిరిగుట్ట మండలంలోని పలు రిసార్టులలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం.