చంద్రబాబుకు మొట్టికాయ ఖాయం: వైఎస్ జగన్
పత్తికొండ: ఏ సీఎం కైనా ప్రజావ్యతిరేకత రావడానికి రెండుమూడేళ్లు పడుతుందని, ఏడాది తిరక్కముందే ఈ సీఎం మాకొద్దు బాబోయ్ అంటున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనం అదే మాట అంటున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో బుధవారం రాత్రి జరిగిన సభలో జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు సభలో ఈరోజు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని, దాని గురించి పట్టించుకోవద్దని... అందరూ తనవంకే చూడాలని సీఎం అన్నారని తెలిపారు. పురుగుల మందు తాగిన రైతును తరలించడానికి 108కి ఫోన్ చేస్తే రాలేదని, చివరకు ఆటోలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాలు మాఫీ చేసేశానని సిగ్గులేకుండా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. రుణమాఫీ కాదు కదా వడ్డీలు కూడా మాఫీ చేయలేదన్నారు. బాబు అధికారంలోకి రాగానే ఉన్న జాబులు పోతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రజలు గట్టి మొట్టికాయ వేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు సర్కారును బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతో దూరంలో లేదని వైఎస్ జగన్ అన్నారు.
సంబంధిత వార్తలు