రుద్రమకోటలో అతి పురాతన సమాధులు | Oldest Tombs In Rudrama kota :Archaeological Department | Sakshi
Sakshi News home page

రుద్రమకోటలో అతి పురాతన సమాధులు

Mar 15 2018 11:42 AM | Updated on Mar 15 2018 11:42 AM

Oldest Tombs In Rudrama kota :Archaeological Department - Sakshi

కుక్కునూరు : ప్రపంచంలో కెల్లా అతిపురాతనమైన సమాధులు ఈజిప్టు తర్వాత వేలేరుపాడు మండలంలోని రుద్రమకోటలో ఉన్నాయని పురావస్తుశాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ అన్నారు. బుధవారం రుద్రమకోటలోని పురాతన సమాధుల తవ్వకాలను థాయిలాండ్, దక్షిణకొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఆర్కియాలజిస్టులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మూడునెలలుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, ఆదిమానవుల అవశేషాలు, వారు వాడిన వస్తువులు తదితర సామగ్రిని పోలవరం, రాజమండ్రిల్లో మ్యూజియాలు ఏర్పాటుచేసి ప్రదర్శనకు ఉంచుతామన్నారు. అవశేషాలను హైదరాబాద్‌కు తరలించి వాటి డీఎన్‌ఏలపై పరిశోధనలు చేసి అప్పటి మానవుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం తదితర విషయాలు తెలుసుకుంటామన్నారు. కొన్ని అవశేషాలను పూనేలోని ఆర్కియాలజీ కేంద్రానికి తరలించామన్నారు.

ఇక్కడి సమాధులు క్రీస్తు పూర్వం వెయ్యి ఏళ్ల ముందువని, అప్పటి మహిళలు వాడిన పూసలను కార్మేలియన్‌ రాయి నుంచి తయారుచేశారని చెప్పారు. కార్మేలియన్‌ రాయి గుజరాత్‌లో మాత్ర మే లభిస్తుందని, దీని ద్వారా రుద్రమకోట నుంచి గుజ రాత్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. విదేశీ ఆర్కియాలజిస్టులు మాట్లాడుతూ తవ్వకాల్లో దొరికిన ఎముకలను బట్టి చూస్తే అప్పటివారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. పొక్లయిన్‌ సా యంతో తప్ప మోయలేని బండరాళ్లను సమాధుల మీద ఏర్పాటుచేసిన విధానం చూస్తే వారు ఎంత బలవంతులో అర్థం చేసుకోవచ్చన్నారు. రుద్రమకోట అద్భుతమైన  చరి త్రగల గ్రామామన్నారు. ఆర్కియాలిజీ పరిశోధన కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, పురావస్తుశాఖ  అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement