ఢిల్లీకి ఎవరెళ్లారు..?
మన్యంలో అధికారుల సర్వే
ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
పాడేరు: విశాఖ ఏజెన్సీ అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు ప్రాంతం నుంచి ఢిల్లీలోని మత ప్రార్థనలకు ముస్లింలు వెళ్లి ఉంటారనే కారణంతో ఐటీడీఏ పీవో డి.కె బాలాజీ వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ఫిబ్రవరి నుంచి అనేక మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లారనే ప్రచారం అధికంగా ఉంది. పాడేరుకు చెందిన ముస్లిం పెద్ద ఖాన్ కూడా జనవరిలో వెళ్లారు. కించుమండ, డుంబ్రిగుడ ప్రాంతాలకు చెందిన కొంత మంది మంది ఇటీవల జరిగిన సదస్సుకు హాజరయ్యారనే సమాచారంతో వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి. పాడేరుకు చెందిన ఖాన్తో పాటు అన్ని ముస్లిం కుటుంబాల సర్వే చేయాలని ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు మినుములూరు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ భూపతి, ఏఎన్ఎం మండి బుజ్జి, రెండో ఏఎన్ఎం దేవి, ఆశా కార్యకర్త బేబిరాణి గురువారం అన్ని మసీదు ప్రాంతాలు, వారి నివాసాల వద్దకు వెళ్లి సమగ్ర వివరాలను సేకరించారు. అయితే పాడేరులోని ముస్లింలెవరూ ఇటీవల ఢిల్లీకి వెళ్లలేదని చెప్పడంతో వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు.
నక్కపల్లి: ఢిల్లీ వెళ్లిన ముస్లిం వివరాలు సేకరించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నియోజకవర్గంలో అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలస్థాయి అధికారులు వలంటీర్ల ద్వారా ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సర్వే నిర్వహించాలని చెప్పారు.