సీఎం జగన్‌ను కలిసిన న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు ప్రతినిధులు

New Development Bank Vice President Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70 శాతాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది. (చదవండి: ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top