అయ్యో లోకేషా... ఎంత పని జరిగింది?
నిడమర్రు గ్రామంలో...అయ్యగోరికి...ఆత్మీయ స్వాగతం
సాక్షి, మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్కు అనుకోని సంఘటన ఎదురైంది. అనుకోకుండా తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి అయ్యగోరు బిత్తరపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే....అల్లుడు రియల్గా చూపించాడబ్బా, దీన్ని కూడా ప్రతిపక్షం కుట్ర అంటారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ విషయంలోకి వస్తే... మంత్రి నారా లోకేష్ గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు ఒక్కసారిగా కూలింది. అయితే ప్రచార సభలో పాల్గొన్న కార్యకర్తలపై ఈ బోర్డు పడింది. లోకేష్తో పాటు ఎంపీ గల్లా జయదేవ్...మిగతా నేతలు అంతా కొద్ది దూరంలో ఉన్నా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
చిన్న పిల్లలతో ఇదేమీ పని?
మరోవైపు.... ఎదుట వాళ్లకు చెప్పేందుకే నీతులు ఉంటాయనేది.. టీడీపీ నేతల విషయంలో రుజువైంది. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి.... నానా హంగామా చేసే పచ్చ తమ్ముళ్లకు మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టదనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ.
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అధికారాన్ని, అధికారులను, పోలీసులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, గెలుపే లక్ష్యంగా ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. అది చాలదన్నట్లు చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రిని మోపించారు. లోకేష్ నిన్న మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో పర్యటించారు. ఆ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో నాయకులు తప్ప, కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట లేకపోవడంతో పాఠశాలల విద్యార్థుల చేత బాణాసంచా మోయించారు. ఆయన పర్యటన అయ్యేంతవరకూ చిన్నారులు బాణాసంచాను తన భుజాలపై మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులతో పాటు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.