నాందేడ్ ఎక్స్ప్రెస్లో ప్రమాద విషయం గ్రహించిన కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు తెగించి కదులుతున్న రైల్లో నుంచి దూకేశారు.
అనంతపురం : చలికాలం... తెల్లవారుజాము.. చుట్టూ చీకటి.. ఆ సమయంలో ఇవి ఎవరికీ పట్టవు. ప్రాణాలు కాపాడుకుంటే చాలనిపిస్తుంది. నాందేడ్ ఎక్స్ప్రెస్లో ప్రమాద విషయం గ్రహించిన కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ప్రాణభయంతో తెగించి ముందుకు దూకారు. కొందరు ప్రయాణికులు బోగీ నుంచి ఉన్నపళంగా దూకేస్తే మరికొందరు బాత్రూమ్లోని అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ ప్రయత్నాల్లో చాలా మంది తీవ్రగాయాల పాలయ్యారు. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను ధర్మవరం, అనంతపురం, పెనుగొండ, పుట్టపర్తిల్లోని ఆస్పత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తనూశ్రీ అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల రోదనలు, బంధువుల కన్నీటితో ఆస్పత్రుల ప్రాంగణాలు శోక సంద్రాల్లా మారిపోయాయి.